UPDATED 9th APRIL 2022 SATURDAY 06:00 AM
AP New Ministers : ఆంధ్రప్రదేశ్లో కొత్త కేబినెట్ కూర్పుపై సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు. రేపటికి కొత్త మంత్రుల జాబితా పూర్తి చేసి.. ఎల్లుండి ప్రమాణస్వీకారం కార్యక్రమం నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
ఇప్పటికే కొత్త మంత్రులెవరు? పాత మంత్రులెవరిని కొనసాగించాలన్న దానిపై సీఎం జగన్ పూర్తి క్లారిటీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాజీనామా చేసిన మంత్రుల్లో 10 మందికి తిరిగి చాన్స్ దక్కనుందని తెలుస్తోంది. బొత్స, పెద్దిరెడ్డి, కొడాలి, బుగ్గన, పేర్ని, అనిల్, బాలినేని, కన్నబాబు సీనియారిటీ ప్రకారం కొనసాగించే ఛాన్స్ ఉంది.సామాజిక సమీకరణాల ప్రకారం జయరామ్, వేణుగోపాల్, అప్పలరాజు, సురేష్, అంజాద్ బాషా, శంకర్ నారాయణ, తానేటి వనితను కొత్త కేబినెట్లోకి తీసుకుంటారని టాక్ నడుస్తోంది.
జగన్ కొత్త టీమ్లో 14 నుంచి 15 మంది వరకు మాత్రం కొత్త ముఖాలు కనిపించడం ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు కొత్త కేబినెట్ కూర్పుపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో సుదీర్ఘంగా చర్చించారు సీఎం జగన్. సామాజిక సమీకరణాలతో పాటు సీనియర్ మంత్రుల్ని కొనసాగించడంపై వీరిద్దరూ చర్చించారు. మంత్రివర్గంలోకి కొత్తగా ఎవర్ని తీసుకోవాలి.. పాతవారిలో ఎవర్ని కొనసాగించాలన్న అంశంపై చర్చించారు. ఇక మంత్రివర్గం ఏర్పాటుపై సీఎం జగన్ నిర్ణయమే ఫైనల్ అన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి.
మంత్రివర్గంలో ఎవరు ఉండాలనేది పూర్తిగా సీఎం నిర్ణయమన్నారు.ఇక నుంచి ఎన్నికల సమయమని, ప్రతి ఎమ్మెల్యే నియోజకవర్గంలోని ప్రతి గడపకు రెండుమూడు సార్లువెళ్లి ప్రజలకు మరింత దగ్గర కావాలని సీఎం జగన్ సూచించారు. ప్రజాదరణ లేని వారికి ఎట్టి పరిస్థితుల్లో టికెట్ ఇచ్చేదిలేదని స్పష్టం చేశారు. అంతేకాక కేబినెట్ కూర్పుపై జగన్ దృష్టిసారించారు.
ఇప్పటికే కేబినెట్లోని 24 మంది మంత్రులు రాజీనామా చేయగా.. కొత్తగా ఏర్పాటు కాబోయే మంత్రివర్గంలో పాతవారికి ఒకరిద్దరు మినహా కొత్తవారికే మంత్రి పదవులు కట్టబెడతానని జగన్ స్పష్టం చేశారు. అయితే రాబోయేది ఎన్నికల కాలం కావటంతో అందరూ కొత్తవారైతే ఇబ్బందులు ఎదురవుతాయని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.







