అమరావతి (రెడ్ బీ న్యూస్) 20 డిసెంబర్ 2021: వచ్చే మూడేళ్లలో ఏపీ ప్రభుత్వం తీసుకునే రుణాలపై ఆంక్షలు విధించినట్లు కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. ఎఫ్ఆర్బీఎం పరిమితి కన్నా తక్కువ రుణాలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఇప్పటివరకు ఎఫ్ఆర్బీఎం పరిధికి మించి ఏపీ ప్రభుత్వం రూ.17,924 కోట్ల రుణాలు తీసుకుందని తెలిపింది. అధికంగా తీసుకున్న రుణాలను మూడేళ్లలో సర్దుబాటు చేసేలా ఏపీ ప్రభుత్వానికి అవకాశమిచ్చినట్లు పేర్కొంది. లోక్సభలో తెదేపా ఎంపీ కేశినేని నాని, వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు అడిగిన ప్రశ్నలకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. రాబోయే కాలంలో చేసే అప్పుల విషయంలో ఎఫ్ఆర్బీఎం పరిమితి దాటకుండా ఎట్టిపరిస్థితుల్లో చూసుకోవాలని కేంద్ర ఆర్థిక శాఖ సూచించింది.







