రెడ్ బీ న్యూస్, 21 డిసెంబర్ 2021: ప్రపంచంలోనే అతిపెద్ద క్రూజ్ నౌకగా పేరొందిన ‘ది రాయల్ కరేబియన్ సింఫనీ ఆఫ్ సీస్’.. ఇప్పుడు కరోనా క్లస్టర్గా మారింది. ఈ నౌకలో ప్రయాణిస్తున్న 48 మందికి వైరస్ పాజిటివ్గా నిర్ధారణ అవడంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. 6వేల మందికి పైగా ప్రయాణిస్తున్న ఈ నౌకను ప్రస్తుతం ఫ్లోరిడాలోని మియామీ పోర్ట్లో నిలిపి ఉంచారు. రెండు రోజుల క్రితం నౌకలో ఓ ప్రయాణికురాలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గొంతునొప్పితో పాటు విపరీతమైన దగ్గు రావడంతో నౌకలోని వైద్యులు పరీక్షలు నిర్వహించగా.. కొవిడ్ పాజిటివ్గా తేలింది. దీంతో అప్రమత్తమైన సిబ్బంది ఆమెతో దగ్గరగా ఉన్న వ్యక్తులకు కూడా కరోనా పరీక్షలు నిర్వహించగా.. 48 మందికి పాజిటివ్గా తేలినట్లు నౌక యాజమాన్య సంస్థ ది రాయల్ కరేబియన్ ఓ ప్రకటనలో వెల్లడించింది. అయితే వీరికి సోకింది ఒమిక్రాన్ వేరియంటా..? కాదా? అన్నది తెలియాల్సి ఉంది. నౌకలో ప్రస్తుతం 6వేల మందికి పైగా ప్రయాణిస్తుండగా.. వీరిలో 98శాతం మంది రెండు డోసులు తీసుకున్నవారే అని ది రాయల్ కరేబియన్ వెల్లడించింది. కరోనా సోకిన వారిలో చాలా మందికి లక్షణాలు లేవని, కొందరు స్వల్ప లక్షణాలతో బాధపడుతున్నట్లు తెలిపింది. వైరస్ కలకలం నేపథ్యంలో ప్రయాణికులందరినీ క్వారెంటైన్లో ఉంచినట్లు వెల్లడించింది.







