UPDATED 10th JUNE 2026 9:00 AM
కాకినాడ, రెడ్ బీ న్యూస్, జూన్ 10 : కాకినాడ నగరంలోని భానుగుడి జంక్షన్ వద్ద మంగళవారం రాత్రి ఓ కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగి పూర్తిగా దహనమైంది. సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
అసలేం జరిగిందంటే..?
పిఠాపురానికి చెందిన గరగా అనిల్కుమార్ అనే వ్యక్తి తన కారులో ఏసీ పనిచేయకపోవడంతో మంగళవారం ఉదయం కాకినాడలోని ఒక మెకానిక్ షెడ్కు తీసుకువచ్చారు. అక్కడ రేడియేటర్ క్లీన్ చేయించాలని సిబ్బంది సూచించడంతో, ఆయన స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని మరో దుకాణంలో ఆ పని చేయించారు. అనంతరం కారును తిరిగి మెకానిక్ షెడ్కు తీసుకెళ్తుండగా, భానుగుడి జంక్షన్ వద్దకు రాగానే వాహనం నిలిచిపోయింది.
అనుమానం వచ్చి అనిల్కుమార్ కారు ఆపి, బానెట్ తెరిచి చూశారు. ఆ సమయంలో ఒక్కసారిగా ఇంజిన్ నుండి దట్టమైన పొగలు వచ్చి, చూస్తుండగానే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.
రంగంలోకి అగ్నిమాపక సిబ్బంది
సమాచారం అందుకున్న సాలిపేట అగ్నిమాపక కేంద్రం సిబ్బంది వెంటనే ఫైర్ ఇంజిన్తో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. ప్రమాద సమయంలో కారులో ఉన్నవారు వెంటనే కిందకు దిగిపోవడంతో తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. అందరూ ఊపిరి పీల్చుకున్నారు
ఆస్తి నష్టం అంచనా : ఈ ప్రమాదంలో కారు పూర్తిగా కాలి బూడిదవడంతో సుమారు రూ. 10 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని అగ్నిమాపక అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు.షార్ట్సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కాకినాడ టూటౌన్ సీఐ ఎం.అప్పలనాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.







