కర్నూలు (రెడ్ బీ న్యూస్) 11 డిసెంబర్ 2021: మొన్నటి వరకు వినియోగదారుల కంట కన్నీరు పెట్టించిన ఉల్లి.. ప్రస్తుతం రైతుల కంట కన్నీరు పెట్టిస్తోంది. ఉల్లి పంటకు గిట్టుబాటు ధర లేదని ఓ రైతు ఆగ్రహించి తాను పండించిన పంటకు నిప్పు పెట్టాడు. ఈ ఘటన కర్నూలు వ్యవసాయ మార్కెట్లో చోటు చేసుకుంది. పంచలింగాల గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు ఉల్లిని విక్రయించేందుకు కర్నూలు మార్కెట్కు తీసుకొచ్చాడు. ఈ-నామ్ పద్ధతిలో క్వింటా రూ.350 ధర పలకడంతో ఆగ్రహించిన రైతు ఉల్లి బస్తాలపై పెట్రోల్ పోసి నిప్పుపెట్టాడు. ఈ ఘటనపై స్పందించిన అధికారులు క్వింటాకు రూ.700 ఇప్పిస్తామని ప్రకటించడంతో రైతులు శాంతించారు. ఉల్లి ధర ఒక్కసారిగా పడిపోవడమే రైతు ఆగ్రహానికి కారణం. కనీసం ఉల్లి పంటకు పెట్టిన పెట్టుబడి కూడా రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గిట్టుబాటు ధర కల్పించాలని రైతు సంఘాల నాయకులు కోరుతున్నారు.







