UPDATED 9th NOVEMBER 2022 WEDNESDAY 2:30 PM
AP Former Minister Ayyannapatrudu : ఏపీ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడికి హైకోర్టులో భారీ ఊరట లభించింది. 10 సంవత్సరాలు పైన శిక్ష పడే సెక్షన్ 467 ఈ కేసులో వర్తించదని కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ప్రాథమిక అంశాలను పరిశీలించిన అనంతరం ఈ నిర్ణయానికి వచ్చామని చెప్పింది. జలవనరుల శాఖ అధికారులు ఇచ్చిన ఎన్ఓసీ విలువైన పత్రాల నిర్వచనం కిందకు రాదని హైకోర్టు స్పష్టం చేసింది.
అర్నేష్ కుమార్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శక సూత్రాల ప్రకారం నడుచుకోవాలని సీఐడీకి ఆదేశాలు జారీ చేసింది. సీఆర్పీసీలోని 41 ఏ కింద అయ్యన్నపాత్రుడికి నోటీసులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. సీఐడీ విచారణ జరుపుకోవచ్చని హైకోర్టు పేర్కొంది. అయ్యన్నపాత్రుడిపై సీఐడీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలని ఆయన తరుపు న్యాయవాది వీవీ సతీష్ హైకోర్టును ఆశ్రయించారు.
గతవారం ప్రభుత్వం, అయ్యన్నపాత్రుడు తరపు న్యాయవాదుల వాదనలను విన్న అనంతరం ఉత్తర్వులను హైకోర్టు రిజర్వ్ చేసింది. ఈ రోజు అయ్యన్నపాత్రుడి కేసులో ఐపీసీలోని సెక్షన్ 467 వర్తించదని కోర్టు స్పష్టం చేసింది.







