UPDATED 2nd JULY 2017 SUNDAY 5:00 PM
కాకినాడ : మొక్కలు పెంచటం వల్లే కలిగే ప్రయోజనాలు ప్రజలందరికి అవగాహన కల్పించాలని విద్యార్థులు ఇందుకు కృషిచేయాలని జిల్లా కలెక్టరు కార్తికేయమిశ్రా పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం వనం-మనం కార్యక్రమంలో భాగంగా విద్యార్థులతో గ్రీన్ రన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ రన్ స్థానిక టూ టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద కలెక్టర్ కార్తికేయ మిశ్రా, స్థానిక ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మొక్కలు పెంచటం వల్ల భవిష్యత్తులో కాలుష్య సమస్యలను నివారించవచ్చని, దీనిపై విద్యార్థులు తమ తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు. పాఠశాల స్థాయిలో ర్యాలీలు, అవగాహన సదస్సులు నిర్వహించి మొక్కలు నాటేందుకు ప్రోత్సహించాలని విద్యార్థులు, ఉపాధ్యాయులకు సూచించారు. ఆదివారం సెలవు దినమైనా విద్యార్థులు ఉత్సాహంగా మహోన్నత ఉద్యమంలో పాల్గొన్నారని కలెక్టర్ వారిని అభినందించారు. కాకినాడ సిటి ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ప్రతీ ఇంటివద్ద ఒక మొక్కను నాటాలన్నారు. మున్సిపల్ కమీషనర్ ఎస్.అలీంబాషా మాట్లాడుతూ కాకినాడను పచ్చని నగరంగా తీర్చిదిద్దుతున్నామని, ఇప్పటికే నగరంలో 30 వేలకుపైగా మొక్కలు నాటినట్లు ఆయన తెలిపారు. ప్రతీ ఇంటికి మొక్కలను పంపిణీ చేసి నాటించినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ -2 రాధాకృష్ణమూర్తి, బీసీ కార్పొరేషన్ ఈడీ జ్యోతి, జిల్లా అటవీ శాఖాధికారిణి నందిని సలారియా, సమాచార శాఖ డీడీ ఫ్రాన్సిస్, సర్వశిక్షాభియాన్ పీవో ఎం.శేషగిరి, అధిక సంఖ్యలో విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.







