* జిల్లా కలెక్టర్ మురళీధర్రెడ్డి
UPDATED 30th NOVEMBER 2020 MONDAY 9:00 PM
కాకినాడ (రెడ్ బీ న్యూస్): రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి డిసెంబర్ నెల 25వ తేదీన జిల్లా నుంచి ఇళ్ళ పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్న నేపథ్యంలో లేఅవుట్లను పూర్తిస్థాయిలో సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ డి. మురళీధర్రెడ్డి అధికారులను ఆదేశించారు. నవరత్నాలు-పేదలందరికీ ఇళ్ళు కార్యక్రమంపై కలెక్టర్ జిల్లా, డివిజనల్ స్థాయి అధికారులతో సోమవారం సాయంత్రం జూమ్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. డివిజన్ల వారీగా ప్రస్తుత పరిస్థితిపై ఆయన ఆరా తీశారు. తొలిదశలోని 1,48,526 లబ్ధిదారులకు సంబంధించి మ్యాపింగ్, జియోట్యాగింగ్ ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. ఇళ్ళ పట్టాలతో పాటు ఇళ్ళకు సంబంధించి శంకుస్థాపన జరగనున్నందున వాలంటీర్లు, ఇంజనీరింగ్, డిజిటల్ అసిస్టెంట్లు, హౌసింగ్ ఏఈలు తదితరుల భాగస్వామ్యంతో మ్యాపింగ్, జియో ట్యాగింగ్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. మ్యాపింగ్కు అవసరమైన లబ్ధిదారుల సమాచారం సచివాలయాల్లో అందుబాటులో ఉందని, ఆ సమాచారాన్ని కూడా ఉపయోగించుకోవాలని సూచించారు. భూమిని చదును, మార్కింగ్ చేయడం, రాళ్లు పాతడానికి సంబంధించి ఇంకా పెండింగ్ పనులు ఉంటే సత్వరం పూర్తి చేయాలన్నారు. క్షేత్ర స్థాయిలో ప్రతీ అధికారి పర్యటించి, వాస్తవ పరిస్థితులను తెలుసుకొని పనులు పూర్తికి ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. అధికారుల మధ్య సమన్వయం ఉన్నప్పుడే ఈ ప్రణాళికల అమలు సాధ్యమవుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్లు డాక్టర్ జి. లక్ష్మీశ, కీర్తి చేకూరి, జి. రాజకుమారి, డీఆర్వో సీహెచ్ సత్తిబాబు, సబ్ కలెక్టర్లు, ఆర్డీవోలు, మునిసిపల్ కమీషనర్లు, తదితరులు పాల్గొన్నారు.







