UPDATED 20th AUGUST 2022 SATURDAY 10:00 PM
TTD: శ్రీకృష్ణజన్మాష్టమి వేడుకల్లో భాగంగా తిరుమలలో శనివారం ఉట్లోత్సవం అత్యంత వేడుకగా జరిగింది. శ్రీవేంకటేశ్వరస్వామివారికి గోకులాష్టమి ఆస్థానం నిర్వహించిన మరునాడు ఉట్లోత్సవాన్ని(శిక్యోత్సవం) నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
ఇందులోభాగంగా శ్రీమలయప్పస్వామివారు బంగారు తిరుచ్చిపై, శ్రీకృష్ణస్వామి మరో తిరుచ్చిపై తిరువీధులలో ఊరేగుతూ పలు ప్రాంతాల్లో ఉట్లోత్సవాన్ని తిలకించారు. ముందుగా శ్రీమలయప్పస్వామివారు, శ్రీకృష్ణస్వామివారి ఉత్సవమూర్తులు ఊరేగింపుగా శ్రీ పెద్దజీయర్ మఠానికి వేంచేపు చేశారు. అక్కడ ఆస్థానం చేపట్టారు.
ఆ తరువాత హథీరాంజీ మఠానికి, కర్ణాటక సత్రాలు తదితర ప్రాంతాల్లో ఉట్లోత్సవం నిర్వహించారు. శ్రీవారి ఆలయం ఎదుట ఉట్లోత్సవం ఉత్సాహంగా జరిగింది. సాయంత్రం నుండి రాత్రి వరకు ఆద్యంతం కోలాహలంగా సాగిన ఈ ఉట్లోత్సవంలో స్థానికులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉట్లను పగులగొట్టారు.
ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్స్వామి, డెప్యూటీ ఇఓ శ్రీ హరీంద్రనాథ్, పార్ పత్తేదార్ శ్రీ ఉమామహేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.







