కాకినాడ (రెడ్ బీ న్యూస్) 26 నవంబర్ 2021: రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో వరద నష్టాన్ని అంచనా వేసేందుకు సీఎం జగన్ గాల్లో తిరగడం (విహంగ వీక్షణం) కాదని, క్షేత్రంలో పర్యటించాలని తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు, సీనియర్ నేత జ్యోతుల నెహ్రూ సూచించారు. ఇది రాజకీయ విమర్శ కాదని, నష్టపోయిన రైతులు, ప్రజలను ఆదుకోవాలని తెదేపా తరఫున కోరుతున్నట్లు పేర్కొన్నారు. కాకినాడలోని తెదేపా కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబుతో కలిసి శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. క్షేత్రంలోకి వెళ్తే వాస్తవ లెక్కలొస్తాయని, బాధితులకు భరోసా లభిస్తుందన్నారు. బోర్ల కింద రబీ వద్దని మంత్రి కన్నబాబు ప్రకటనపై రైతులునిరాశకు గురయ్యారన్నారు. డెల్టాలో రెండో పంటకు ప్రతి ఎకరాకూ నీరివ్వాలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే కొండబాబు మాట్లాడుతూ, ప్రజలు వరదలు, వర్షాలతో తల్లడిల్లుతుంటే ప్రభుత్వం ఎప్పుడో కట్టుకున్న ఇళ్లకు వన్టైమ్ సెటిల్మెంట్ పేరుతో డబ్బుల వసూళ్లకు ప్రయత్నిస్తోందన్నారు. నాయకులు ఉండవల్లి వీర్రాజు, గోపాల్ తదితరులు పాల్గొన్నారు







