UPDATED 12th OCTOBER 2017 WEDNESDAY 11:30 AM
అగ్ర దర్శకుడు పూరి జగన్నాధ్ తనయుడు ఆకాష్ పూరి హీరోగా మెహబూబా పేరుతో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఈ చిత్రం హిమాచల్ ప్రదేశ్లో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ విషయాన్ని చిత్ర బృందం సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఈ సందర్భంగా అక్కడ ఆకాష్ పూరి, నేహాశెట్టిపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ఛార్మి క్లాప్ నిచ్చారు. ఈ ముహూర్తానికి సంబంధించిన ఫొటోలను చిత్ర వర్గాలు సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. బెంగళూరుకు చెందిన నేహాశెట్టి ఈ చిత్రం ద్వారా కథానాయిక పరిచయం అవుతున్నది. పూరిజగన్నాథ్ టూరింగ్ టాకీస్ పతాకంపై నిర్మితమవుతున్న ఈ చిత్ర నిర్మాణ బాధ్యతల్ని ఛార్మి నిర్వహిస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్లో చిత్రాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉంది. నందమూరి బాలకృష్ణగారు ఈ చిత్రాన్ని తనదిగా భావించి చాలా జాగ్రత్తలు తీసుకుని మంచి ముహూర్తాన్ని పెట్టించారు. ఉదయం నుంచి ఫోన్లు చేస్తూ చిత్రీకరణకు సంబంధించిన విషయాల్ని ఆరాతీస్తూ మా చిత్ర బృందాన్ని ఆశీర్వదించారు. మీకు ధన్యవాదాలు సర్ అని దర్శకుడు పూరి జగన్నాథ్ తన ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేశారు.







