UPDATED 28th JULY 2017 FRIDAY 7:00 PM
రాజమహేంద్రవరం: భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా చేపట్టిన మీజిల్స్, రుబెల్లా (ఎంఆర్) వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని జిల్లావ్యాప్తంగా ఆగస్టు 1 నుంచి సెప్టెంబరు 8వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టరు కార్తికేయ మిశ్రా తెలిపారు. శుక్రవారం రాజమహేంద్రవరంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో 9 నెలల నుంచి 15 సంవత్సరాల లోపు చిన్నారులు పట్టణ ప్రాంతంలో 3,09,543, గ్రామీణ ప్రాంతాల్లో 8,15,327, ఏజెన్సీ ప్రాంతంలో 90,890 మంది ఉన్నారని వీరందరికీ ఎంఆర్ టీకా వేయనున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు 5,716, అంగన్వాడీ కేంద్రాలు 5,546 ఉన్నాయని వీటన్నింటి వద్ద వ్యాక్సిన్ వేయడానికి ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. వీటితో పాటు పాఠశాలలకు వెళ్లని వారిని గుర్తించేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుని ముందుకు సాగుతున్నామన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు 7,323 మంది మెడికల్, పారా మెడికల్ సిబ్బందిని, వీఆర్వో నుంచి అధికారుల వరకు వారి సేవలను వినియోగించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో నగరపాలకసంస్థ కమిషనర్ విజయరామ్రాజు, వైద్య శాఖ అధికారులు పాల్గొన్నారు.







