హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 26 నవంబర్ 2021: ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్(sivasankar) ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకుని చిరంజీవి చలించిపోయారు. శివశంకర్ చిన్న కుమారుడు అజయ్ని తమ ఇంటికి ఆహ్వానించి ఉదారతను చాటుకున్నారు. తనవంతు సాయంగా రూ.3 లక్షల చెక్కును అజయ్కు అందించారు. శివశంకర్ చికిత్సకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. కంగారు పడొద్దని, శివశంకర్ మాస్టర్కు అండగా తామంతా ఉన్నామనే ధైర్యానిచ్చారు. ‘చిరంజీవిగారంటే నాన్నకు ఎంతో అభిమానం. వారిద్దరి కలయికలో పలు హిట్ గీతాలు తెరకెక్కాయి. చిరంజీవి చేసిన సాయం మరిచిపోలేనిది. ఈ కష్టసమయంలో ప్రతి పైసా మాకు అవసరం’ అని అజయ్ అన్నారు.
కొన్నిరోజుల క్రితం కరోనా బారిన పడిన శివశంకర్ చికిత్స కోసం గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చేరారు. ఊపిరితిత్తులకు 75 శాతం ఇన్ఫెక్షన్ సోకడంతో ఆయన ఆరోగ్యం విషమంగా మారింది. ప్రస్తుతానికి ఐసీయూలో వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నారు. కరోనా బారిన పడిన శివశంకర్ పెద్ద కుమారుడూ అదే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన సతీమణికీ కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ కాగా ఆమె హోం క్వారంటైన్లో ఉన్నారు. కుటుంబ సభ్యుల చికిత్సకు కావాల్సిన డబ్బు తన వద్ద లేకపోవడంతో అజయ్ సామాజిక మాధ్యమాల వేదికగా దాతల్ని కోరారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు నటులు స్పందించారు. తమవంతు సాయం చేసేందుకు ముందుకొచ్చారు.







