రాజమహేంద్రవరం (రెడ్ బీ న్యూస్) 8 డిసెంబర్ 2021 : ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్న జాయింట్ సబ్ రిజిస్ట్రార్కు చెందిన ఇళ్లు, కార్యాలయంలో సోదాలు చేసిన అవినీతి నిరోధక శాఖ(అనిశా) అధికారులు ఆయన అక్రమార్జన రూ.1.4 కోట్లుగా గుర్తించారు. విశాఖపట్నంకు చెందిన జమ్ము వెంకటవరప్రసాదరావు తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్శాఖలో జాయింట్ సబ్ రిజిస్ట్రార్గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకు ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు అధికారులకు సమాచారం ఉంది. దీంతో అనిశా అధికారులు ఆయనకు సంబంధించిన 7 ప్రాంతాల్లో మంగళవారం ఉదయం సోదాలు చేశారు. రాజమహేంద్రవరంలోని ఆయన నివాసం, ఆత్రేయపురంలోని కార్యాలయం, కాకినాడ, విజయవాడ సమీపంలోని గుణదల, తెలంగాణలోని మేడ్చల్, మల్కాజ్గిరిలో కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్లల్లో ఏకకాలంలో తనిఖీలు చేశారు. 2 ఫ్లాట్లు, జీ ప్లస్-2 భవనం, 2 ఇంటి స్థలాలు, కారు, ద్విచక్ర వాహనం, బంగారం, ఎలక్ట్రానిక్ వస్తువులు, గృహోపకరణాలు, బ్యాంకు ఖాతాలు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.2.5 కోట్లుగా అధికారులు తెలిపారు. ఇందులో రూ.1.4 కోట్ల అక్రమాస్తులు ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. వెంకట వరప్రసాదరావును రాజమహేంద్రవరం అనిశా కోర్టులో హాజరుపర్చగా రిమాండ్ విధించినట్లు అధికారులు తెలిపారు.







