విశాఖపట్నం, 29 మే 2020 (రెడ్ బీ న్యూస్): మాల్దీవులు, కొమోరిన్, దక్షిణ బంగాళాఖాతంలో కొన్ని ప్రాంతాలు,అండమాన్ సముద్రం,అండమాన్-నికోబార్ దీవుల్లో మిగిలిన ప్రాంతాలకు గురువారం నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. రానున్న 48 గంటల్లో మాల్దీవులు,కొమోరిన్లలో మరికొన్ని ప్రాంతాలకూ విస్తరించనున్నాయి.కాగా కేరళ, కర్ణాటక తీరాలకు ఆనుకుని ఆగ్నేయ అరేబియా సముద్రంలో ఈనెల 31లోగా అల్పపీడనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో జూన్ 1న కేరళలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ప్రకటించింది.కాగా, పశ్చిమ మధ్య అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వచ్చే 48 గంటల్లో వాయుగుండంగా మారనుందని పేర్కొంది. జూన్ 1న కేరళలో రుతుపవనాలు ప్రవేశించిన తరువాత వాతావరణం అనుకూలిస్తే 6,7 తేదీలకల్లా రాయలసీమకు విస్తరించే అవకాశం ఉందన్నారు.







