ప్రొద్దుటూరు (రెడ్ బీ న్యూస్) 23 డిసెంబర్ 2021: ప్రభుత్వ పథకాలను ప్రజలకు అత్యంత పారదర్శకంగా అందిస్తున్నామని ఏపీ సీఎం జగన్ అన్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. రెండున్నరేళ్లలో ప్రొద్దుటూరు లబ్ధిదారులకు నేరుగా రూ.326 కోట్లు అందించామన్నారు. ప్రతి ఇంటికీ తాగునీరు అందించేందుకు పైపు లైన్ ఏర్పాటు సీఎం చెప్పారు. నియోజకవర్గంలో కోర్టు కేసులను పరిష్కరించి ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేశామన్నారు. ఇంటి స్థలాల సేకరణకే రూ.200 కోట్లు ఖర్చు అవుతోందని చెప్పినా ఏమాత్రం వెనకడుగు వేయకుండా మంజూరు చేశామన్నారు. ప్రొద్దుటూరులో డ్రైనేజీ వ్యవస్థకు రూ.163 కోట్లు కేటాయించామన్నారు. సీవరేజ్ ప్లాంట్, ఆర్టీపీపీ రోడ్డుపై వంతెన నిర్మిస్తామని.. రూ.51 కోట్లతో కూరగాయల మార్కెట్ నిర్మిస్తామని జగన్ తెలిపారు. రూ.24 కోట్లతో డిగ్రీ కళాశాల రూపురేఖలు మారుస్తున్నామని.. రూ.63 కోట్లతో ఇంజినీరింగ్ కళాశాల భవనాలు నిర్మిస్తామని సీఎం వివరించారు. పింఛ, అన్నమయ్య ప్రాజెక్టుల వల్ల నష్టపోయినవారికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.







