UPDATED 8th FEBRUARY 2022 TUESDAY 03:00 PM
తిరుమల (రెడ్ బీ న్యూస్): తిరుమల కొండపై అంజనాదేవి ఆలయ నిర్మాణానికి తిరుమల తిరుపతి దేవస్థానం సన్నాహాలు చేస్తుంది. ఎప్పటి నుంచో అంజనాదేవి ఆలయాన్ని నిర్మించతలపెట్టినా.. ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. ఈక్రమంలో అన్ని అడ్డంకులను తొలగించుకుని ఫిబ్రవరి 16న తిరుమల కొండపై ఆకాశగంగలో అంజనా దేవి ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన, భూమిపూజ చేయనున్నట్లు టీటీడీ ఈవో జవహర్ రెడ్డి తెలిపారు. అంజనా దేవి ఆలయానికి భూమి పూజ జరిగే ఆకాశగంగను టీటీడీ ఈవో జవహర్ రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డిలు మంగళవారం పరిశీలించారు. ప్రముఖ సినీ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి ఆధ్వర్యంలో ఈ ఆలయ నిర్మాణ పనులు జరగనున్నట్టు తెలుస్తుంది.
ఈమేరకు ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి సైతం మంగళవారం టీటీడీ అధికారులతో కలిసి స్థల పరిశీలన చేశారు. అనంతరం ఆకాశగంగలో నిర్మించనున్న అంజనా దేవి ఆలయం డిజైన్లను ఈవో జవహర్ రెడ్డి పరిశీలించారు. ఆలయానికి గోపురాలు, ప్రవేశ ద్వారాలు ఇతర డిజైన్లను పరిశీలించారు. తిరుమల కొండపై అటవీ పర్యావరణ వ్యవస్థకు ఇబ్బంది లేకుండా ఆలయాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్లు జవహర్ రెడ్డి తెలిపారు. గోగర్భం డ్యాం వద్ద హనుమంతుని విగ్రహం ఏర్పాటు చేసేందుకు స్థల పరిశీలన చేశారు.







