హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 17 జనవరి 2022 : భవిష్యత్ తరాలకు చక్కని వాతావరణాన్ని అందించాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఎలక్ట్రిక్ వాహనాలు మరింత పెరగాలని.. గ్రీన్ ఎనర్జీ దిశగా మరిన్ని ప్రయత్నాలు జరగాలని ఆకాంక్షించారు. హైదరాబాద్ లో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నారు. కేటీఆర్ సమక్షంలో ఫార్ములా-ఈ టీమ్ తో తెలంగాణ ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. అనంతరం ఏర్పటు చేసిన కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ.. ఈ ఒప్పందం సరికొత్త శకానికి నాందిగా అభివర్ణించారు. అంతర్జాతీయ సంస్థలకు అవసరమైన సదుపాయాలను తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తోందని మంత్రి వివరించారు. సీతారాంపూర్, దివిటిపల్లిలో ఈవీ క్లస్టర్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో ఇప్పటికే పలు సంస్థలతో ఒప్పందం చేసుకున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్ ఫార్ములా వన్ రేసింగ్ ను ప్రారంభించినందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. రాబోయే రోజుల్లో హైదరాబాద్ ఈ-రేసు హోస్ట్ గా నిలవనుందన్నారు. సెక్రటేరియట్, తెలుగుతల్లి ఫ్లైఓవర్, హుస్సేన్ సాగర్ చుట్టూ 2.87 కిలోమీటర్ల ఈ- రేసింగ్ కోర్టు అందుబాటులోకి రానుందని వివరించారు.







