UPDATED 5th SEPTEMBER 2017 TUESDAY 7:00 PM
ప్రత్తిపాడు: తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేటు కోర్ట్ లో మంగళవారం దొంగలు పడి భవనంలోని వివిధ విభాగాల్లో వీరంగం సృష్టించిన సంఘటన స్థానికంగా సంచలం కలిగించింది. ముసుగు వేసుకొన్న దొంగలు రాత్రిపూట కాపలాగా ఉన్న ప్రోసెస్ సర్వర్ని కొట్టి కుర్చీకి కట్టేసి ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం పోలీసులమంటూ కొందరు కోర్టు హాలు తలుపుతట్టారని, రోజువారీ బీట్కు వచ్చే పోలీసులనుకుని కాపలాగా ఉన్న ప్రాసెస్ సర్వర్ తలుపు తీశారన్నారు. అతనిపై దొంగలు దాడి చేసి కుర్చీకి కట్టి బంగారం, నగదు ఎక్కడుంటాయని ఆరా తీసి కోర్ట్ ఫైల్స్ ను నేలపై విసిరేశారు. భవనం పై అంతస్తులో గల కిటికీలోంచి చొరబడ్డారని, వారు సంచరించిన ప్రదేశంలో ఏవిధమైన ఆధారాలు దొరక్కుండా ఉండేలా కారంపొడి జల్లి గదికి తాళాలు వేసి వెళ్లిపోయారన్నారు. విషయం తెలిసిన వెంటనే పెద్దాపురం డీఎస్పీ రామారావు, ప్రత్తిపాడు జగ్గంపేట సీఐలు శ్రీనివాసరావు, కాశీవిశ్వనాథం, ఎస్సై అశోక్లు ఘటనా స్థలాన్ని పరిశీలించి ప్రాసెస్ సర్వర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.







