UPDATED 16th MARCH 2022 WEDNESDAY 01:10 PM
Criticisms of TDP MLAs 11 TDP MLAs Suspended : గత కొన్ని రోజులుగా అసెంబ్లీ, మండలిని జంగారెడ్డి గూడెం ఘటన కుదిపేస్తోంది. కల్తీ సారా వల్లే మరణాలు సంభవించాయని ప్రతిపక్షం ఆరోపిస్తుంటే.. కామన్ సెన్స్ లేకుండా ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని అధికార పార్టీ మండిపడుతోంది.
ఈక్రమంలో అసెంబ్లీలో ఆందోళన చేస్తున్న ఎమ్మెల్యేలను సస్పండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా.. 2022, మార్చి 16వ తేదీ బుధవారం పలువురు ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని ఆరోపించారు. జగన్ ఫైర్ కాదు ఫ్లవర్ అని ప్రజలకు అర్థమైపోయిందని రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ విమర్శించారు.
కల్తీసారా మరణాలపై నిలదీస్తే వరుసగా మూడు రోజులు అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారని, కల్తీసారా తయారీలో వైసీపీ నేతల పాత్ర ఉన్నందుకే సభలో సీఎం తప్పుడు ప్రకటనలు చేశారని ఆరోపించారు.
జంగారెడ్డి గూడెంలో కల్తీసారా లేదని సీఎం చెబితే, ఉందని ఆర్డీవో, ఎస్సీబీ, పోలీసులు నిరూపించారన్నారు. 27మంది అమాయకుల చావుకు ముఖ్యమంత్రే కారణమని, కల్తీసారాపై నమోదైన ఎఫ్ఐఆర్ (FIR)లకు సంబంధించి సీఎం ఏం సమాధానం చెప్తారని నిలదీశారు. 27 మంది కల్తీసారాతో చనిపోతే, సభలో సీఎం సహజ మరణాలంటూ అతివినయం ప్రదర్శించారని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు.
సభలో సీఎం అసత్యాలు చెప్పినందుకు ఆయనపై సభాహక్కుల నోటీసు ఇచ్చామన్నారు. అబద్దాలు చెప్పిన సీఎంపై స్పీకర్ ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని ప్రశ్నించారు. కల్తీ సారాపై సమాధానం చెప్పలేకే భయపడి టీడీపీ సభ్యులను రోజూ సస్పెండ్ చేస్తున్నట్లు ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు విమర్శించారు.
అధికారికంగా నాటుసారా కేసులు నమోదవుతున్న సాక్ష్యాలు ఉంటే, ముఖ్యమంత్రి ఎలా అసత్యాలు చెబుతున్నారని విమర్శించారు.మత్తు కోసం వివిధ రసాయినాలు నాటుసారాలో వాడబట్టే అవయవాలు త్వరగా దెబ్బతిని చనిపోతున్నట్లు ఆకన వివరించారు.
అసెంబ్లీ గౌరవ సభ కాదు కౌరవ సభ అని మరోసారి రుజువైనట్లు, రోజురోజుకూ మరణాల సంఖ్య పెరుగుతున్నా సభను తప్పుదోవ పట్టించిన సీఎంకు సస్పెన్షన్ ఎందుకు వర్తించదన్నారు ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్, ఆడబిడ్డలకు న్యాయం చేస్తానంటూ అధికారంలోకి వచ్చిన జగన్ వారి పుస్తెళ్ళు తెంపుతున్నారని రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ తెలిపారు.
గన్ కంటే ముందు వస్తానన్న జగన్ గత మూడేళ్లలో ఏ ఒక్క మహిళకు న్యాయం చేయలేదని, తమ అవినీతి బయటపడుతుందనే సభలో కల్తీ సారా అంశం చర్చకు రాకుండా సస్పెండ్ చేస్తున్నారని వైసీపీని విమర్శించారు.







