తిరుమల (రెడ్ బీ న్యూస్) 4 డిసెంబర్ 2021: కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవేంకటేశ్వరస్వామి మనందరినీ రక్షించి భక్త వత్సలుడని మరోమారు చాటి చెప్పారని తితిదే ఈవో కేఎస్ జవహర్రెడ్డి అన్నారు. కొండచరియలు విరిగిపడే ప్రమాదముందని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ముందస్తుగా తీసుకోవాల్సిన చర్యల గురించి స్వామి వారు తమను హెచ్చరించారన్నారు. ఆఫ్కాన్ సంస్థ ఇంజినీరింగ్ నిపుణులు, తితిదే ఇంజినీరింగ్ అధికారులతో కలిసి కొండచరియలు విరిగిపడిన ప్రాంతాన్ని, లింక్ రోడ్డును ఈవో పరిశీలించారు. ఈ సందర్భంగా ఈవో మీడియాతో మాట్లాడుతూ.. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ఒకటో తేదీ తెల్లవారుజామున రెండవ ఘాట్ రోడ్డులోని భాష్యకార్ల సన్నిధి సమీపంలో భారీ బండరాయి పడి నాలుగు వేర్వేరు ప్రాంతాల్లో ఘాట్ రోడ్డు తీవ్రంగా దెబ్బతిందన్నారు. ఈ ఘటన జరిగినప్పుడు వాహనాలు ఉన్నాయని, కానీ శ్రీవారి అనుగ్రహంతో ఎవరికీ చిన్న ప్రమాదం లేకుండా అందరినీ రక్షించినందుకు వేంకటేశ్వర స్వామికి ధన్యవాదాలు తెలిపారు.







