UPDATED 15th MARCH 2022 TUESDAY 02:50 PM
Somu Veerraju: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్న ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించేలా బీజేపీ రోడ్డు మ్యాప్ కోసం ఎదురు చుస్తున్నానంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా పనవ్ వ్యాఖ్యలపై బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పందించారు.
మంగళవారం విశాఖలో పార్టీ నేతలతో సమావేశం అనంతరం సోము వీర్రాజు మీడియాతో మాట్లాడారు. 2024 ఎన్నికల కోసం తిరుపతి మీటింగ్ సమయంలోనే అమిత్ షా దిశా నిర్దేశం చేశారని..రెండు నెలల క్రితమే మాకు రోడ్ మ్యాప్ ఇచ్చారని సోము వీర్రాజు పేర్కొన్నారు. అందులో భాగంగానే రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేస్తున్నామని తెలిపారు. మిత్ర పక్షంగా జనసేనతో కలిసి వెళతామన్న సోము వీర్రాజు.. పవన్ కళ్యాణ్..కేంద్రంలోని బీజేపీ ప్రతినిధులతో టచ్ లో వున్నారని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన బీజేపీ కలిసే ప్రభుత్వంపై పోరాటం చేస్తాయని సోము వీర్రాజు అన్నారు. మార్చి 19న ఛలో కడపకు పిలుపునిచ్చిన సోము వీర్రాజు.. రాయలసీమ రణభేరి చేపట్టనున్నట్లు తెలిపారు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసేలా ప్రభుత్వం పై ఒత్తిడి తెస్తామని, అందుకోసం నియోజకవర్గాల వారీగా భారీ సభలు నిర్వహించి వైసీపీ ప్రభుత్వం పాలనను ప్రజల వద్ద ఎండగడతామని సోము వీర్రాజు అన్నారు.
ప్రాజెక్టులకు గేట్లు మెయింటైన్ చేయడానికి నిధులు, సిబ్బందిని కేటాయించడంలో ప్రభుత్వం విఫలమైందని వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించారు సోము వీర్రాజు. రాయలసీమ నుంచి ఎంత మంది ముఖ్యమంత్రులు వచ్చినా.. సాగు విస్తీర్ణం 19 లక్షల ఎకరాలు దాటలేదని సోము వీర్రాజు పేర్కొన్నారు.







