Disha Patrolling Vehicles: మహిళల రక్షణ నిమిత్తం మరో 163 దిశ పాట్రోలింగ్ వాహనాలు అందుబాటులోకి

UPDATED 23 MARCH 2022 WEDNESDAY 10:50 AM

Disha Patrolling Vehicles: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళల రక్షణ కొరకు ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. మహిళలు, చిన్నారుల భద్రత కొరకు పోలీస్ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తూ దిశ పాట్రోలింగ్ వాహనాలను ఏపీ ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. బుధవారం ముఖ్యమంత్రి జగన్‌ అసెంబ్లీ ప్రాంగణంలో 163 దిశ పాట్రోలింగ్ వాహనాలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ..రాష్ట్రంలో 1.16 కోట్ల మంది మహిళలు దిశ యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్నారని, వారి భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ఇప్పటికే దిశ పోలీస్‌స్టేషన్లలో 900 ద్విచక్ర వాహనాలు అందుబాటులో ఉన్నాయని, 3 వేలకు పైగా ఎమర్జెన్సీ వాహనాలను ప్రారంభించనున్నట్లు సీఎం జగన్‌ తెలిపారు.

బుధవారం 163 పాట్రోలింగ్ వాహనాలను అందుబాటులోకి తెచ్చిన ఏపీ ప్రభుత్వం మహిళా సిబ్బంది కోసం 18 దిశ మొబైల్ విశ్రాంతి వాహనాలను సైతం అందుబాటులోకి తెచ్చింది. దిశ పాట్రోలింగ్‌ వాహనాలు జీపీఎస్‌ ద్వారా జిల్లా కంట్రోల్‌ రూమ్‌కి నేరుగా అనుసంధానమై ఉంటాయి. అత్యవసర సమయాల్లో, ఆపదలో ఉన్న మహిళలు దిశ యాప్ ద్వారా సమాచారం అందిస్తే పట్టణాల్లో 4-5 నిమిషాల్లో, గ్రామాల్లో 8-10 నిమిషాల్లో దిశ సిబ్బంది చేరుకుంటారు.

దిశ పాట్రోలింగ్ వాహనాలకుగానూ రూ. 13.85 కోట్లు, రెస్ట్‌ రూమ్స్‌కి రూ. 5.5 కోట్లు ఖర్చు చేశారు. రాష్ట్రంలో మహిళలపై దాడులు జరిగితే కఠిన శిక్షలు పడేలా చూస్తామని సీఎం జగన్ హెచ్చరించారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us