Vijayawada Jobs Scam : రూ.5లక్షలు ఇస్తే అమెరికా, ఇంగ్లండ్‌లో ఉద్యోగం.. కట్ చేస్తే ఘరానా మోసం,

Updated 15th December 2022 Thursday 10:10 pm

Vijayawada Jobs Scam : నిరుద్యోగులే వారి టార్గెట్. ప్రభుత్వ, విదేశీ ఉద్యోగాలు పేరుతో ఊరించారు. ఉద్యోగం పేరుతో ఒక్కొక్కరి నుంచి రూ.5లక్షలు వసూలు చేశారు. డబ్బు పోతే పోయింది ఫారిన్ జాబ్ వస్తుంది కదా. చెల్లించిన డబ్బుకన్నా ఎక్కువ సంపాదించుకోవచ్చు అని అంతా ఆశపడ్డారు. కట్ చేస్తే.. అడ్డంగా మోసపోయారు. విదేశీ ఉద్యోగాల పేరుతో దగా పడ్డారు. జాబ్ లేదు ఏమీ లేదు అంతా మోసం అని తెలిసి లబోదిబోమంటున్నారు. విజయవాడలో వెలుగుచూసింది ఈ జాబ్ స్కామ్.

విదేశీ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు వల వేశారు. అమాయకుల అవసరాలను ఆసరాగా చేసుకుని లక్షల్లో గుంజారు. చివరికి బోర్డు తిప్పేశారు. విజయవాడలో ఘరానా మోసం వెలుగుచూసింది. ఉద్యోగాల పేరుతో డయల్ ఇన్ స్టిట్యూట్ (డయల్ ఇన్ స్టిట్యూషన్స్) చేసిన చీటింగ్ బట్టబయలైంది.

బందర్ రోడ్ లో కార్యాలయం ఏర్పాటు చేసిన ఈ సంస్థ.. ప్రభుత్వ, విదేశీ ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగులకు టోకరా వేసింది డయల్ ఇన్ స్టిట్యూట్. అమెరికా, ఇంగ్లండ్, దుబాయ్, మలేషియాలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికింది. ఒక్కొక్కరి నుంచి రూ.5లక్షలు వసూలు చేసింది.

తీరా, తాము మోసపోయామని తెలుసుకున్న బాధితులు లబోదిబోమంటున్నారు. 30 మంది బాధితులు సూర్యారావుపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. ఇన్ స్టిట్యూట్ యజమాని సిద్ధార్ధ్ వర్మను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ఈ సంస్థ బాధితులు వేల సంఖ్యలో ఉంటారని పోలీసులు అంచనా వేశారు.

అసలే జాబ్ లేక ఇబ్బందుల్లో ఉన్నాము. విదేశాల్లో ఉద్యోగం అంటే ఆశపడ్డాం. అప్పు చేసి మరీ డబ్బులు కట్టాము. ఇప్పుడేమో అంతా మోసం అంటున్నారు. ఇప్పుడు తమ పరిస్థితి ఏంటి? అని బాధితులు వాపోతున్నారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని, చెల్లించిన డబ్బు వెనక్కి ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు బాధితులు.

కాగా, ఉద్యోగాల పేరుతో మోసాలు చేస్తున్న ఘటనలు ఇటీవలి కాలంలో బాగా పెరిగాయి. నిరుద్యోగులే టార్గెట్ గా కొందరు వ్యక్తులు మోసాలకు పాల్పడుతున్నారు. ఆశలు పెట్టి, ప్రకటనలతో ఊరించి నిరుద్యోగుల నుంచి లక్షలు, కోట్ల రూపాయలు దండుకుంటున్నారు. మంచి సమయం చూసుకుని బోర్డు తిప్పేస్తున్నారు. ఎలాంటి పెట్టుబడి పెట్టకుండానే పెద్ద మొత్తంలో డబ్బు కొట్టేసి జంప్ అవుతున్నారు. తాము మోసపోయాము అని బాధితులు తెలుసుకునే లోపే డబ్బుతో ఎస్కేప్ అవుతున్నారు. ఇలాంటి ఘటనలు అనేకం జరుగుతున్నాయి.. ఇంకా కొందరిలో మార్పు రావడం లేదు. మోసపూరిత ప్రకటలు నమ్మి అడ్డంగా దగా పడుతున్నారు.

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us