TTD: తిరుమలలో జూలై 12న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం .. రేపు సెప్టెంబర్ వసతి కోటా టిక్కెట్ల విడుదల

UPDATED 7th JULY 2022 THURSDAY 04:15 PM

TTD: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జూలై 12న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు టీటీడీ వెల్లడించింది.

ఇందులో భాగంగా ఉదయం 6 గంటలకు ప్రారంభమయ్యే తిరుమంజనం కార్యక్రమం సుమారు 5 గంటలపాటు కొనసాగనుంది. సాధారణంగా సంవత్సరంలో నాలుగుసార్లు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనాన్ని నిర్వహించడం ఆనవాయితీ.

ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. తిరుమంజనం కారణంగా మంగళవారంనాడు నిర్వహించే అష్టదళపాదపద్మారాధన సేవను టీటీడీ రద్దు చేసింది. తిరుమంజనం కార్యక్రమం అనంతరం స్వామివారి మూలవిరాట్టుకు ఆలయ అర్చకులు ఆగమోక్తంగా పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తారు.

అనంతరం మధ్యాహ్నం 12 గంటల నుంచి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొంటారు.మరోవైపు సెప్టెంబర్ నెలకు సంబంధించిన వసతి కోటాను రేపు (జూలై 8) ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. శుక్రవారం ఉదయం తొమ్మది గంటలకు ఈ టిక్కెట్లు విడుదలవుతాయి.

అలాగే ఉదయం పదకొండు గంటలకు జూలై 12, 15, 17 తేదీల్లో వర్చువల్ ఆర్జిత సేవా టిక్కెట్లు పొందిన భక్తులకు ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కెట్ల కోటాను టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us