జెరూసలెం (రెడ్ బీ న్యూస్) 1 జనవరి 2022: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచ దేశాలను వణికిస్తున్న వేళ... ఇజ్రాయెల్లో ‘ఫ్లొరోనా’ వ్యాధి కలకలం రేపుతోంది. ఆ దేశంలో తొలి ఫ్లొరోనా కేసు వెలుగుచూసింది. ఈ విషయాన్ని అరబ్ న్యూస్ వార్తా సంస్థ ట్విటర్ వేదికగా వెల్లడించింది. వ్యాధి కట్టడికి ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటున్నట్లు తెలిపింది. ఫ్లొరోనా అంటే కొవిడ్-19, ఇన్ఫ్లూయెంజా డబుల్ ఇన్ఫెక్షన్ అని అర్థం. ఇజ్రాయెల్లో ఈ తరహా కేసు వెలుగు చూడడంతో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది. వ్యాధి వ్యాప్తి కట్టడికి చర్యలు చేపట్టింది. మరోవైపు.. ఇజ్రాయెల్లో కరోనా టీకా నాలుగో డోసును అందించే ప్రక్రియ ప్రారంభించారు. ఒమిక్రాన్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో కొవిడ్ టీకాల ద్వారా అందిన రోగనిరోధకశక్తి క్షీణించడంతో నాలుగో డోసు వేసే ప్రక్రియను ప్రారంభించామని ఇజ్రాయెల్ ఆరోగ్య శాఖ డైరెక్టర్ జనరల్ నాచ్మన్ యాష్ పేర్కొన్నారు. తమ దేశప్రజలకు మూడో డోసు టీకా అందించి నాలుగు నెలలు దాటిందన్నారు. ఇజ్రాయెల్లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. ఆ దేశ ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం కొత్తగా దాదాపు 5,000 కేసులు నమోదయ్యాయి.







