UPDATED 26th AUGUST 2022 FRIDAY 01:10 PM
Plastic Flexis Ban In AP : విశాఖపట్నం వేదికగా సీఎం జగన్ ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై నిషేధం విధించారు. పర్యావరణ పరిరక్షణ, ఆర్థిక పురోగతి నాణేనికి రెండువైపులని ఈ సందర్భంగా జగన్ అన్నారు. ప్లాస్టిక్ ఫ్లెక్సీలు వినియోగించరాదని స్పష్టంచేసిన జగన్ ప్లెక్సీలు ఏర్పాటు చేయాలంటే బట్టతో చేసినవే ఉండాలని సూచించారు. విశాఖ నుంచి ఈ ప్లాస్టీక్ ఫ్లెక్సీల నిషేదం అమలు కావాలని పిలుపునిచ్చారు. శుక్రవారం (ఆగస్టు 26,2022) ఉదయం విశాఖపట్నం ఏయూ కన్వెన్షన్ సెంటర్లో ‘పార్లే ఫర్ ది ఓషన్స్’ సంస్థతో ఎంఓయూ సందర్భంగా.. ప్రసంగిస్తూ ఈ విషయాన్ని ప్రకటించారు జగన్. 2027 నాటికి ప్లాస్టిక్ రహిత ఆంధ్రప్రదేశ్ మన సంకల్పంగా ప్లాస్టిక్ ఫ్లెక్సీలను నిషేధించాలని పిలుపునిచ్చారు.
శుక్రవారం ఉదయం కోస్టల్ బ్యాటరీ నుంచి భీమిలి వరకూ.. ప్లాస్టిక్ వ్యర్థాలను క్లీన్ చేశారు వలంటీర్లు. దాదాపు 76 టన్నుల ప్లాస్టిక్ను సముద్రం తీరం నుంచి తొలగించారు. భూమిపై 70 శాతం ఆక్సిజన్ సముద్రం నుంచే వస్తోంది. అందుకే సముద్రాన్ని కాపాడుకోవాలి. అలాగే ఏపీ తీరాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత పౌరులందరిదిగా ఉండాలని జగన్ సూచించారు. ఈ సందర్భంగా గ్రామీణ ప్రాంతాల్లో చెత్తసేకరణ 100 శాతానికి పెంచాలని అన్నారు.
పార్లే సంస్థ సముద్రం నుంచి ప్లాస్టిక్ వ్యర్థాలను బయటకు తీస్తుంది. రీసైకిల్ చేసి పలు ఉత్పత్తులు తయారు చేస్తుంది. అంతేకాదు.. పార్లే ఫ్యూచర్ ఇనిస్టిట్యూట్ను ఏపీలో ఏర్పాటు చేయనున్నారు అని సీఎం జగన్ వెల్లడించారు. ప్లాస్టిక్ ఫ్లెక్సీల బ్యాన్ తొలి అడుగుగా అభివర్ణించిన సీఎం జగన్.. 2027 కల్లా ఏపీని ప్లాస్టిక్ ఫ్రీ స్టేట్గా మారుస్తామని ప్రకటించారు.







