UPDATED 17th FEBRUARY 2018 SATURDAY 9:00 PM
సామర్లకోట: తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగలు పడి సొమ్ములను ఎత్తుకెళ్లిన సంఘటన తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట పట్టణంలో శనివారం సంచలనం కలిగించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం స్థానిక స్టేషన్ సెంటర్ సమీపంలో నివాసముంటున్న అళక్కి శ్రీనివాసరరావు కుటుంబ సభ్యులు ఇంటిలో లేని సమయంలో ఈచోరీ జరిగింది. శ్రీనివాసరావు భార్య కుటుంబ సభ్యులు వారం రోజుల క్రితం కర్నూలు తమ బంధువులను పరామర్శించేందుకు వెళ్లారు. శుక్రవారం రాత్రి అళక్కి శ్రీనివాసరావు కాశీ వెళుతూ తన కుటుంబ సభ్యులు వచ్చిన తర్వాత తాళం ఇవ్వమని ఇంటి పక్కింటివారికి ఇచ్చాడు. శ్రీనివాసరావు భార్య గంగరాణి, ఆమె కుమార్తె, కుమారుడు శనివారం ఉదయం ఇంటికి వచ్చేసరికి తాళాలు పగులగొట్టి ఉన్నాయి. దీంతో దొంగతనం జరిగినట్టుగా గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్రైమ్ సిఐ, ఎస్సైలు వచ్చి దర్యాప్తు చేయగా ఒక గదిలో బీరువాలో ఉన్న బంగారం, ఉంగరాలు, ఒక గొలుసు, ఒక గాజు, లాకెట్, తీసుకొని మిగతావి చెల్లాచెదురుగా పడేసి అందులో ఉన్న రూ. 50 వేలు, అలాగే వేరొక గదిలో ఉన్న బీరువాలోని ఉన్న రూ.10 వేలు తీసుకుని బంగారం కొంత అక్కడ వదిలేసి డబ్బులు మాత్రమే తీసుకుని వెళ్ళినట్లు పోలీసులు గుర్తించారు. దీనిపై సామర్లకోట ఎస్.ఐ శ్రీనివాస్, క్రైం ఎస్.ఐ. గంగిరెడ్డి అక్కడకు చేరుకొని చోరీ జరిగిన తీరును పరిశీలించారు.







