UPDATED 16th JULY 2022 SATURDAY 05:10 PM
KA Paul : ఆగస్టు 15వ తేదీలోపు విభజన హామీలు అమలు చేయకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కేంద్రాన్ని హెచ్చరించారు. ఈరోజు ఆయన ఢిల్లీలోని రాజ్ ఘాట్ లో విభజన హామీల అమలు కోసం 4 గంటల పాటు గాంధీ సమాధి వద్ద మౌన దీక్ష చేసారు.
అనంతరం విలేకరలుతో మాట్లాడుతూ మరోసారి జులై 20న విభజన హామీల అమలు కోసం జంతర్ మంతర్ వద్ద దీక్ష చేస్తానని చెప్పారు. ఎనిమిదేళ్లుగా అనేక మంది పెద్దలను కలిసి విభజన హామీలు అమలు చేయాలని కోరా..కానీ జరగలేదని ఆయన చెప్పారు. జులై20 న జంతర్ మంతర్ దగ్గర చేసే దీక్షలో ఏపీ,తెలంగాణ ముఖ్యమంత్రులు,నేతలు నేను చేసే ధర్నాలో పాల్గొనాలని ఆయన కోరారు.
రాజకీయాల పక్కన పెట్టి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకుందాం అని పాల్ పిలుపునిచ్చారు. జగన్,కేసీఆర్,గతంలో చంద్రబాబు కేసులకు భయపడి రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెడుతూ కేంద్రాన్ని మద్దతు ఇస్తున్నారని పాల్ వివరించారు. విభజన హామీలు అమలు కాకపోతే బిజెపి, వైసిపి, టిఆర్ఎస్, టిడిపికి ఓటు వేయకుండా బుద్ధి చెప్పాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.







