Updated 22nd April 2023 Saturday 12:20 pm
Pawan Kalyan : ఏపీ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ప్రతిపక్షాలను చూస్తే ఎందుకంత అభద్రతాభావం అంటూ జగన్ సర్కార్ ని నిలదీశారు పవన్ కల్యాణ్. అధికార పక్షం బాధ్యత విస్మరించిన చోట కచ్చితంగా ప్రతిపక్షం ప్రజల కోసం నిలబడుతుందని తేల్చి చెప్పారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానిది కీలక భూమిక అన్న పవన్.. ప్రతిపక్ష పార్టీలను నిలువరించాలని చూస్తే ప్రజాస్వామ్య స్ఫూర్తి దెబ్బ తింటుందని హెచ్చరించారు.
ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యక్రమంపై రాళ్ళ దాడికి పాల్పడటాన్ని పవన్ ఖండించారు. ఆయన భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయని తెలిసిందన్నారు. ప్రతిపక్ష నాయకుల పర్యటనలకు తగిన భద్రత కల్పించడంపై పోలీసు ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని పవన్ కోరారు.
ప్రతిపక్ష పార్టీల కార్యక్రమాలను చూసి అధికారంలో ఉన్న వైసీపీ ఎందుకింత అభద్రతకు లోనవుతుందో అర్థం కావడం లేదన్నారు పవన్ కల్యాణ్. వైసీపీ పాలకులు తమ పాలన ప్రజాహితంగా ఉందని భావించి ఉంటే ఇలాంటి అభద్రతకు గురై ఉండేవారు కాదన్నారు. ప్రజల కోసం ప్రతిపక్ష పార్టీలు మాట్లాడే ప్రతి సందర్భంలో అధికార పక్షం అసహనానికి లోనవుతోందన్నారు.
నేను విశాఖలో జనవాణి కార్యక్రమానికి వెళ్లినప్పుడు పాలకులు వ్యవస్థలను వాడుకొని ఏ విధంగా ప్రవర్తించారో అంతా చూశారు. పాలన వైఫల్యాలను కప్పి పుచ్చుకోవడానికి దాడులకు పాల్పడి, ఆటంకాలు కల్పించడం ద్వారా తాము ఏం కోల్పోబోతున్నారో ముందుగానే వెల్లడిస్తున్నట్లు ఉందని పవన్ కల్యాణ్ అన్నారు.







