UPDATED 6 FEBRUARY 2022 SUNDAY 02:30 PM
అమరావతి (రెడ్ బీ న్యూస్): రాష్ట్రంలోని ఆర్ధిక పరిస్థితుల దృష్ట్యా అనుకున్నంత ఇవ్వలేకపోతున్నట్లు సీఎం జగన్ చెప్పారని పీఆర్సీ సాధన సమితి నేత బండి శ్రీనివాసరావు తెలిపారు. స్టీరింగ్ కమిటీతో ప్రతినెలా భేటీ నిర్వహిస్తామని హామీ ఇచ్చినట్లు చెప్పారు. సీఎంతో భేటీ అనంతరం పీఆర్సీ సాధన సమితి నేతలు మీడియాతో మాట్లాడారు. ఫిట్మెంట్ విషయంలో అంతకంటే అవకాశంలేదని.. అందుకే ఇవ్వలేకపోయినట్లు సీఎం చెప్పారని బండి
శ్రీనివాసరావు వివరించారు. హెమోద్ శ్లాబులు, అదనపు క్వాంటం, కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్, సీపీఎస్ రద్దు అంశాలపై స్పష్టత ఇచ్చారని తెలిపారు.
ఉద్యోగుల పోరాటంతోనే.. వచ్చే ఏడాది మరో వేతన సవరణ: సూర్యనారాయణ
ఉద్యోగుల ప్రధాన డిమాండ్లపై రాష్ట్ర ప్రభుత్వం సానుకూల నిర్ణయాలు తీసుకుందని పీఆర్సీ సాధన సమితి నేత సూర్యనారాయణ చెప్పారు. ఫిట్ మెంట్ ఆశించిన మేర రాలేదనే అసంతృప్తి ఉందన్నారు. గతంలో కేంద్ర విధానాల మేరకు పదేళ్లకోసారి వేతన సవరణకు వెళ్తామన్నారని.. ఉద్యోగుల నిరసనతో ప్రభుత్వం వెనక్కి తగ్గి రాష్ట్ర పీఆర్సీ అమలు చేయడం సంతోషకరమన్నారు.ఉద్యోగుల పోరాటం వల్ల వచ్చే ఏడాది మరో వేతన సవరణ సంఘం వస్తుందని తెలిపారు. ఉద్యోగుల మద్దతుతో ఉన్నంతలో మెరుగైన ఫలితాలని రాబట్టుకున్నామని
సూర్యనారాయణ చెప్పారు.







