అమరావతి (రెడ్ బీ న్యూస్) 18 జనవరి 2022: తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కరోనాతో అస్వస్థతకు గురికావడం విచారకరం. ఆయన త్వరగా కోలుకుని ప్రజల కోసం ఎప్పటిలాగే పని చేయాలని కోరుకుంటున్నానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘దేశంలోనూ, తెలుగు రాష్ట్రాల్లో నమోదవుతున్న కోవిడ్ రోగుల గణాంకాలు ఆందోళనకరంగానే ఉన్నాయి. ప్రజలకు ప్రత్యక్షంగా సేవలు అందించే సిబ్బంది, ఉద్యోగులే అధిక సంఖ్యలో కోవిడ్ బారినపడుతున్నారు. ప్రజా ప్రతినిధులు, రాజకీయవేత్తలు కూడా కోవిడ్ బారినపడుతుండడం దీని తీవ్రతను తెలియచేస్తోంది. ప్రస్తుత పరిస్థితులలో తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు మరింత అప్రమత్తతతో కోవిడ్ నివారణకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి. కోవిడ్ పరీక్షలు పెంచడం ద్వారా వైరస్ సోకినవారిని గుర్తించి వైద్యం చేసే అవకాశం కలుగుతుంది. ఇందుకోసం పరీక్ష కేంద్రాలు పెంచాలి. మొబైల్ పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తే ప్రయోజనం. అలాగే కరోనా మొదటి వేవ్ సమయంలో పాటించిన ట్రాక్ అండ్ ట్రేస్ విధానాన్ని పటిష్టంగా అమలు చేయాలి’’ అని పవన్ కల్యాణ్ చెప్పారు..







