రాజమహేంద్రవరం అర్బన్, 30 డిసెంబరు 2020(రెడ్ బీ న్యూస్): రాజమహేంద్రవరంలో సుమారు రూ.200 కోట్లతో నిర్మించబోయే ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణ శంకుస్థాపనకు కేంద్ర మంత్రి గాంగ్వర్ వచ్చే నెల రెండవ వారంలో రానున్నారని ఎంపీ మార్గాని భరత్రామ్ వెల్లడించారు. బుధవారం ఆయన ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసి శంకుస్థాపన కార్యక్రమానికి ఆహ్వానించగా అంగీకరించారని చెప్పారు. ఆసుపత్రి తోపాటు 32 మంది సిబ్బంది నివసించడానికి వీలుగా క్వార్టర్ల నిర్మాణం చేస్తారన్నారు. ఈ మేరకు నిధులు ఇప్పటికే మంజూరయ్యాయని తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం ప్రాంతంలో ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణ ఆవశ్యకతను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లి స్థల పరిశీలన జరపాలని కోరగా అందుకు మంత్రి అంగీకరించారని ఎంపీ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
